కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మేం సాధించామన్న సీజేపీ

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.
దీనికిముందు, కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయన రాజీనామాను డిమాండ్ చేశాయి.
రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ "మనం అనుకున్నది సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం సాధించి చూపించాం" అని అన్నారు.


ఫొటో సోర్స్, ANI
'ప్రశ్నించినప్పుడే దారిలోకి వస్తారు'
అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, "ఏమనేవారు వీళ్లు? ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని చెప్పేవారు కదా? వీళ్లు అదే అనేవాళ్లు కదా? ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని చెప్పేవారు కదా? మేం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం.. 'ప్రపంచం తల వంచుతుంది.. తలవంచేవాళ్లు ఉండాలి అంతే."
"చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే అయిపోయింది. మీరు భయపడకుండా ఉంటే, ఈ ప్రభుత్వానికి తలవంచకుండా ఉంటే ఎంతటి వారినైనా గద్దె దించవచ్చు అనే దానికి ఈ రాజీనామా నిదర్శనం. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి కూడా భయపడితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?
మనం భయపడకూడదు. మనం గొంతెత్తి ప్రశ్నించినప్పుడే అందరూ దారిలోకి వస్తారు. వాళ్లను దారిలో పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే, ఈ రోజు తమను తాము బాద్ షాలుగా భావించుకుంటున్న వీళ్లంతా.. మన వల్లనే తాము అక్కడ కూర్చున్నామనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, మాకు ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడితోనే అయిపోలేదు. మేం కాక్రోచ్లం.. ఒకసారి లోపలికి వచ్చామంటే అంత తేలిగ్గా బయటకు వెళ్లం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి. ప్రాణాలు కోల్పోయిన ప్రతీ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలి. రెండోది, జులై 20న నిరసనకారులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులు డీసీపీ సందీప్ లాంబా, ఏసీపీ అజేయ్ శర్మ, సచిన్ శర్మలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మోదీ, అమిత్ షాల పేరుతో మీరు మాపై లాఠీచార్జ్ చేశారు కదా. ఇప్పటికైతే ఒక రాజీనామా మాత్రమే జరిగింది. ఒక కేంద్ర మంత్రి చేతే రాజీనామా చేయించగలిగినప్పుడు... మీరెంత? మేం లాఠీ దెబ్బలు తిన్నాం, తలలు పగలగొట్టించుకున్నాం. ఈ దేశ విద్యార్థులు ఎంతో ధైర్యంగా పోరాడారు. జులై 20 నుంచి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులందరిపై పెట్టిన కేసులు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి" అని అన్నారు దీప్కే.
"భారతదేశ ప్రజలారా.. ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి. ఇది నిజమైన ప్రజాస్వామ్యం" అన్నారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


























