పేపర్ లీక్ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్లపై వివిధ పార్టీలు ఏమన్నాయి?

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images
ప్రశ్నాపత్రాల లీకేజ్ను కొందరు విద్యార్థులు మరింత కష్టపడి చదవడానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్, కాక్రోచ్ జనతాపార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించాయి.
‘‘ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే, అరెస్టులు చేయకపోతే, మళ్లీ పరీక్ష నిర్వహించి ఉండకపోతే, ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉండకపోతే ఇప్పుడు యువత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థితిలో ఉండేది కాదు’’ అని ఏఎన్ఐతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
‘పేపర్ లీక్ అయినప్పుడు మేం బాధపడ్డాం. కానీ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని మరింత కష్టపడి చదివాం. బాగా రాణించాం’’ అని కొందరు విద్యార్థులు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.
దీనిపై కాంగ్రెస్ ‘ఎక్స్లో స్పందించింది. ఇవి బాధ్యతారాహిత్యమైన, సున్నితత్వంలేని మాటలని కాంగ్రెస్ విమర్శించింది.
‘‘21 మందికి పైగా యువత ప్రాణాలను బలిగొని, లక్షలమంది యువత నిరసనలకు కారణమైన ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం లెక్కించుకుంటోంది. పేపర్ లీకేజ్లను అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. ఈ వ్యక్తులు దేశ విద్యావ్యవస్థను నాశనం చేశారు’’ అని కాంగ్రెస్ తన పోస్ట్లో పేర్కొంది.
‘‘ఆర్థికమంత్రి ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆప్ విమర్శించింది.
పేపర్ లీకేజ్లు తీవ్రరూపం దాల్చిన ఒక క్యాన్సర్లాంటివి. ఝార్ఖండ్లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం దీన్ని నిర్మూలిస్తోంది. కానీ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల ప్రయోజనాలున్నాయని బీజేపీ అంటోంది’’అని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ‘ఎక్స్’అకౌంట్లో రాసింది.
‘‘ఈ తర్కం ప్రకారం దేశంలోని పత్రాలన్నీ లీకవ్వాలి’’అని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి అశుతోశ్ కాంకా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

